బాసర: ప్రముఖ సరస్వతీ దేవి పుణ్యక్షేత్రం బాసర ఆలయానికి వరద ముప్పు పొంచి ఉంది. ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర ఎగువన కురుస్తోన్న కుండపోత వర్షాలకు గోదావరి నదిలో నీటిమట్టం సాధారణం కంటే 6 అడుగులు పెరిగింది. ఇప్పటికే ఆలయ సమీపంలోని లాడ్జీలు, కాటేజీల్లోకి నీరు చేరాయి. మూడు లాడ్జీలు మునిగిపోయాయి. వాటిల్లో దిగిన 8 కుటుంబాలను NDRF, పోలీసు బృందాలు రక్షించి పడవల్లో వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ట్రాక్టర్లో ప్రయాణించి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. 1983లో ఈ స్థాయిలో గోదావరి నది ఉప్పొంగింది. తిరిగి నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించింది.
మునిగిపోయిన ఆలయ మార్గం..
దేవాలయ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రైల్వేస్టేషన్ నుంచి ఆలయానికి వెళ్ళే దారి కూడా వరద నీటితో మునిగిపోయింది.
నదీ ప్రవాహం ఇలాగే కొనసాగితే ఆలయంలోకి నీళ్లు చేరే అవకాశం ఉంది. కాగా గోదావరి మాత శాంతించాలంటూ నది ఒడ్డున వేదపండితులు శాంతిపూజ నిర్వహించారు.

More Stories
భక్తి శ్రద్ధలతో పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలు
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026
కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి